||సుందరకాండ ||

||నలభయ్యవ సర్గ తెలుగులో||



||ఓం తత్ సత్||
శ్రుత్వాతు వచనం తస్య వాయుసూనోర్మహాత్మనః|
ఉవాచ్మహితం వాక్యం సీతా సురసుతోపమా||1||

స|| వాయుసూనుః మహత్మనః తస్య ఆత్మహితం వాక్యం శ్రుత్వా సీతా సురసుతోపమా ఉవాచ తు ||
తా||మహాత్ముడైన వాయుపుత్రుని తన కోసమై చెప్పిన వచనములు వినిన, సురకాంతలతో సమానమైన సీత ఇట్లు పలికెను.
||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ చత్వారింశస్సర్గః

మహాత్ముడైన వాయుపుత్రుని తన కోసమై చెప్పిన వచనములు వినిన, సురకాంతలతో సమానమైన సీత ఇట్లు పలికెను.

' ఓ వానరా ప్రియమైన మాటలు చెప్పగల నిన్ను చూచినతరువాత, సగము మొలకెత్తిన విత్తనము వర్షము పొందినట్లు, నేను ఆనందించుచున్నాను. శోకముముతో కృశించిపోయిన నా గాత్రములు ఆ పురుషవ్యాఘ్రముని స్పర్శానందము పొందనట్లు నాపై దయ కలుగునట్లు చేయుము. ఓ హరిగణోత్తమా ! కోపముతో ఒక ఇషికతో వాయసముయొక్క కంటిని హరించిన అభిజ్ఞానమును అనవాలుగా ఇవ్వుము. తిలకము చెదిరిపోగా ' నీ చేత మణిశిలతో చెక్కిలిపై దిద్దబడిన విషయము', నువ్వు అతనికి గుర్తు చేయుము. 'ఓ వీరుడా మహేంద్రుడు వరుణులతో సమానమైన నీవు అపహరింపబడి రాక్షసులమధ్యలో నున్నసీతను ఎట్లు ఉపేక్షించుచున్నావు?'

'ఓ అనఘ దివ్యమైన ఈ చూడామణి నాచేత రక్షింపబడినది. కష్టములలో దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నాను.ఓ శ్రీమాన్ ఈ జలనిధిలో పుట్టిన దీనిని అనవాలుగా పంపిస్తున్నాను. ఇంక ముందు జీవించడము కష్టము. నేను అసహ్యమైన దుఃఖములను, ఘోరమైన రాక్షసుల వచనములను నీరాక కొరకై సహిస్తున్నాను. ఓ నృపాత్మజ శత్రుసూదనా ఈ జీవితము ఒక మాసము ధరించెదను. నీవు లేకుండా మాసము గడినచిన పిమ్మట జీవించను. రాక్షసరాజు ఘోరమైన వాడు. నాకు అతని దృష్టి సుఖము కలిగించదు. నీ రాకలో జాప్యత విని ఒక క్షణము జీవించను'.

మహాతేజోవంతుడైన ఆ హనుమంతుడు ఆ సీతయొక్క కరుణను గలిగించు వచనములను విని అప్పుడు సమాధానము ఇచ్చెను.

' ఓ దేవీ నీ శోకముతో రాముడు అన్నివిషయములలో విముఖుడై ఉన్నాడు. నిజము చెప్పుచున్నాను. రాముడు దుఖములో ఉండుటవలన లక్ష్మణుడు పరితపిస్తున్నాడు. ఓ భామిని అదృష్టము కొలదీ నీవు చూడబడినావు. ఇప్పుడు పరితపించుటకు కాలము కాదు. ఈ ముహూర్తమే నీ శోకముల అంతము కనిపించుచున్నది. శత్రువులను మర్దించునట్టి ఆ పురుషవ్యాఘ్రములవంటి ఆ రాజపుత్రులిద్దరూ, నీ దర్శనమునకై గల ఉత్సాహముతో లంకానగరమును భస్మము చేసెదరు. ఓ విశాలాక్షీ రావణుని బంధువర్గముతో కలిపి సమరములో హతమార్చి నిన్ను రాఘవుడు తన నగరమునకొ కొనిపోవును. దోషరహితురాలా ! రామునకు ప్రీతి కలిగించు మరి ఒక అభిజ్ఞానమును ఇమ్ము'.

అప్పుడు ఆమె ' నా చేత ఉత్తమమైన అభిజ్ఞానము ఇవ్వబడినది. ఓ వీరుడా నాచే ఇవ్వబడిన కేశ భూషణము చూచిన వెంటనే నీ మాటలు రాముడు శ్రద్ధగా వినును' అనిచెప్పెను.

ఆ ప్లవగసత్తముడు ఆ మణివరమును స్వీకరించి దేవికి శిరసా అభివాదము చేసి వెళ్ళుటకు తయారు అయ్యెను.

అప్పుడు జనకాత్మజ వెళ్ళుటకు ఉత్సాహముతో పెరిగిన , మహావేగము కల ఆ హరిపుంగవుని చూచి కన్నీళ్లతో నిండిన కళ్లతో గద్గద స్వరముతో ఇట్లు పలికెను.

' ఓ హనుమా సింహములవంటి సోదరులు , అమాత్యులతో కూడిన సుగ్రీవుని , తక్కిన అందరినీ క్షేమము అడుగుము. మహాబలుడు అయిన ఆ రాఘవుడు నన్ను ఎట్లు ఈ దుఃఖసాగరమునుంచి రక్షించునో అది నీవు చూడుము. ఓ హరిప్రవీర! రాముని వద్దకు పోయి నా తీవ్రమైన శోకమును రాక్షసుల బెదిరింపులు చెప్పుము. నీ ప్రయాణము శుభప్రదము అగుగాక'.

అప్పుడు ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేశము తీసుకొని కృతార్థుడై సంతోషము కలమనస్సు కలవాడై మిగిలిన కార్యము గురించి ఆలోచించుచూ తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభయ్యవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||
స రాజపుత్త్ర్యా ప్రతివేదితార్థః కపిః కృతార్థః పరిహృష్టచేతాః|
అల్పావశేషం ప్రసమీక్ష్య కార్యం దిశం హ్యుదీచీం మనసా జగామ||25||

స|| స కపిః రాజపుత్ర్యా ప్రతివేదితార్థః కృతార్థః పరిహృష్టచేతసః కార్యం అల్పావశేషం ప్రసమీక్ష్య ఉదీచీం దిశం మనసా జగామ||
తా|| ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేశము తీసుకొని కృతార్థుడై సంతోషము కలమనస్సు కలవాడై మిగిలిన కార్యము గురించి ఆలోచించుచూ తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను.
||ఓం తత్ సత్||